న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. శత్రుదేశాల ఖండాంతర క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని తుత్తునియలు చేయగల కొత్తరకం క్షిపణి ఎండో–అట్మాస్ఫెరిక్ ఇంటర్సెప్టర్ను విజయవంతంగా ప్రయోగించింది.
ఒడిశా తీరంలోని యుద్ధ నౌక నుంచి శనివారం డీఆర్డీవో (రక్షణ పరిశోధన పరిశోధన సంస్థ), నావికా దళం ఈ పరీక్ష నిర్వహించాయి. శత్రు దేశాల క్షిపణిని మధ్యలోనే అడ్డుకుని, ధ్వంసం చేయగలిగే సరికొత్త బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) సాంకేతికతను సొంతం చేసుకున్న దేశాల సరసన భారత్ నిలిచిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలో పాలుపంచుకున్న డీఆర్డీవో, నేవీ, రక్షణ పరిశ్రమల ప్రతినిధులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు.