ఢిల్లీ: భారత్లో మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికాలోని USCIRF కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. అమెరికా ఇతర దేశాల సంస్థలపై నివేదికలు ఇవ్వడం బదులు ఆ దేశంలో హిందువుల ఆలయాలపై దాడులు జరగకుండా చూసుకోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన (USCIRF) కమిషన్ భారత్లో మతస్వేచ్ఛకు సంబంధించిన విషయాలపై అధ్యయనం చేసింది. భారత్లో క్రమపద్ధతిలో, మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కనుక భారత్ను ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా గుర్తించాలని ప్రభుత్వానికి నివేదించింది. దానితో పాటు మతస్వేచ్ఛ ఉల్లంఘనలకు పాల్పడుతన్నందుకు భారత్కు చెందిన RAW రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ,RSS సంస్థలకు చెందిన వ్యక్తులు మరియు సంస్థల ఆస్తులను స్తంభింపజేయాలని పేర్కొంది.
తాజాగా దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. " అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ ఇచ్చిన తాజా నివేదికను మేము పరిశీలించాము. భారతదేశంపై చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాము. అవి ప్రేరేపితమైనవి మరియు పాక్షికమైనవి. గత కొన్ని సంవత్సరాలుగా USCIRF భారతదేశాన్ని వక్రీకృతమైన సమాచారం చూపిస్తూ వస్తోంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే నివేదికలు కమిషన్ యొక్క విశ్వసనీయతను తగ్గిస్తాయి. భారత దేశంపై విమర్శలు మాని అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, అక్కడ నివసిస్తున్న భారతీయ వలసదారులపై పెరుగుతున్న అసహనం, బెదిరింపులపై USCIRF ఆలోచించాలి,” అని తెలిపారు.
USCIRF అనేది ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న మతస్వేచ్ఛ పరిస్థితులపై ఏటా నివేదిక అందిస్తుంది. అందులో భాగంగా కొన్ని దేశాలను CPC ప్రత్యేక ఆందోళనకర దేశాలుగా గుర్తించాలని సూచిస్తుంది..


