షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్లు, కమిషన్ల ఛైర్పర్సన్లు, వైస్-ఛైర్పర్సన్లు, డిప్యూటీ ఛైర్పర్సన్లు, ప్రిన్సిపల్ అడ్వైజర్లు, బోర్డులు, రాజకీయ సలహాదారులకు ఇచ్చిన ‘కేబినెట్ ర్యాంక్’ హోదాను ఉపసంహరించుకుంది.
పరిపాలనా ప్రోటోకాల్ను సరళీకరించేందుకు తీసుకున్న ఈ నిర్ణయంలో సంబంధిత అధికారుల జీతం, నెలవారీ భత్యాలపై 20 శాతం తాత్కాలికంగా కోత విధిస్తున్నట్లు చెప్పింది. ఇది 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రతినిధి ప్రకటనలో తెలిపారు.
ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ కోసం ఈ చర్యలు తీసుకుంటోంది. క్యాబినెట్ ర్యాంక్ హోదా రద్దు నిర్ణయాన్ని భద్రతా కవర్లు, అధికార వాహనాలు, సిబ్బంది హక్కులు వంటి ప్రోటోకాల్ వ్యయాలను తగ్గించే చర్యగా కూడా భావిస్తున్నారు.


