హర్దోయ్: ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఓ వివాహ వేడుక రణరంగంగా మారింది. తను ఆన్లైన్లో ఎవరితోనైతే మాట్లాడిందో.. పెళ్లి పీటల మీద ఉన్నది ఆ వ్యక్తి కాదని వధువు గుర్తించడంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో వరుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. వరుడు దేవేంద్ర సింగ్ పరిమార్ (23)కు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ యువతి పరిచయమైంది. ఫోన్లలో మాట్లాడుకున్న వీరిద్దరూ ప్రేమలో పడి.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఈ నెల మే 12న వివాహానికి ముహూర్తం కుదిరింది. వరుడి తరపు వారు పెళ్లి ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నారు. వధువు వృత్తిరీత్యా లాయర్. పెళ్లి పీటల మీద ఉన్న వరుడిని చూడగానే ఆమె కంగుతింది. తను గత కొంతకాలంగా రాహుల్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నానని.. కానీ అక్కడ ఉన్నది అతను కాదని ఆమె తేల్చి చెప్పింది. వధువు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు.
వరుడు దేవేంద్ర సింగ్తో పాటు పెళ్లికి వచ్చిన అతిథులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దేవేంద్రను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ అలోక్ రాజ్ నారాయణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఆన్లైన్ మోసం, ఫోటోల మార్పిడి కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.


