ఒకే ప్రతిభ– వేరు ప్రపంచాలు
ఒకే వయసు, ఒకే ప్రతిభ, ఒకే కలలు కంటున్న పిల్లల మధ్య భవిష్యత్తు పూర్తిగా వేరుగా ఉండటానికి కారణం ఒక్కటే – చదివే స్కూల్. ఇది సాధారణ విద్యా వ్యత్యాసం కాదు, కొత్త అసమానతల అగాథం. పిల్లల మధ్య పోటీ ఇప్పుడు 10వ తరగతిలో కాదు, ఎల్కేజీలోనే మొదలవు తోంది. ధనికుల పిల్లలు ఇంటర్నేషనల్ స్కూళ్లలో గ్లోబల్ ఎక్స్పోజర్తో చదువుతుంటే, మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు భారీ ఫీజులు, రుణాలు చెల్లించి ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా విద్య అనేది పెట్టుబడిగా కాకుండా రుణ ఉచ్చుగా మారుతోంది. ఇది ‘ఎవరు బాగా చది వారు’ అనే పోటీ కాదు, ‘ఎవరు మంచి ప్రారంభ స్థానం పొందారు’ అనే అసమాన పోటీగా మారింది.
1990ల తర్వాత జనాభా పెరిగింది, చదువు మీద ఆసక్తి పెరిగింది. కానీ ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు సకాలంలో విస్తరించలేదు. ఇంగ్లీష్ మీడియం ఆలస్యంగా ప్రవేశ పెట్టింది. ఈ ఖాళీని ప్రైవేటు రంగం పూరించింది. ఏసర్ 2024 ప్రకారం 6–14 వయసు పిల్లల్లో ప్రభుత్వ స్కూళ్ల ఎన్రోల్మెంట్ 66.8 శాతానికి పడిపోయింది (2022లో 72.9%, 2018లో 65.6%). తెలంగాణలో యూడీఐఎస్ఈ 2024–25 డేటా ప్రకారం, క్లాస్ 1లో ప్రభుత్వ స్కూళ్ల ఎన్రోల్మెంట్ 26 శాతానికి పడిపోయింది. 2013–14తో పోలిస్తే 40 శాతం తగ్గుదల. ప్రైవేటు స్కూళ్లలో విద్యా వంతులైన తల్లిదండ్రులు, హోమ్ సపోర్ట్, సెలెక్టివ్ అడ్మిషన్స్ ఉంటాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్, పేదరికం, ఆరోగ్య–పోషకాహార సమస్యలు ఉన్న పిల్లలు ఎలాంటి సెలెక్షన్ లేకుండా చేరుతారు. ‘నీళ్లు ఉన్న చోట ఎవరైనా పంట పండించ వచ్చు. ఎడారిలో పంట పండించడం కష్టం’ అన్న సూక్తి ఇక్కడ పూర్తిగా వర్తిస్తుంది. సమస్య ప్రభుత్వ స్కూళ్ల వైఫల్యం కాదు, వ్యవస్థ డిజైన్, అమలు, పెట్టుబడి లోపాల్లో ఉంది. ఒకప్పుడు రైతు కొడుకు డాక్టర్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పుట్టిన కుటుంబం భవి ష్యత్తును చదువు నిర్ణయిస్తోంది.
విద్యా వర్గ విభజన
వరల్డ్ బ్యాంక్ అధ్యయనాల ప్రకారం భారతదేశంలో అంతర్ తరం సామాజిక గతిశీలత (ఒక సామాజిక వర్గం నుంచి మరొక వర్గానికి ఎదగడం) నాలుగు దశాబ్దాలుగా స్థిరంగా ఉంది. పేద కుటుంబాల నుంచి ఉన్నత స్థాయికి ఎక్కడం అరుదైన విషయం. ఇది క్లాస్ లాక్–ఇన్కు (వర్గ బంధనం) దారి తీస్తోంది. ఇలా కొనసాగితే మన సమాజం అవకాశాలు కలిగినవారు, అవకాశాలు కోల్పోయినవారు అనే రెండు భాగాలుగా విడిపోయే ప్రమాదముంది.
చైనాలో విద్యా వ్యవస్థ ద్వారా అన్ని వర్గాల విద్యార్థులు నాణ్య మైన విద్యను పొందుతున్నందున వారు ఆర్థిక వ్యవస్థకు భారీగా దోహద పడుతున్నారు. కానీ మన దేశంలో మిడిల్ క్లాస్, పేద వర్గాల విద్యార్థులు సమాన అవకాశాలు లేకపోవడం వల్ల చైనా విద్యార్థులతో పోలిస్తే చాలా తక్కువగా జీడీపీకి దోహదపడుతున్నారు. ఇది దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వృద్ధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందుకే మన విద్యావ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు కావాలి. అన్ని వర్గాల పిల్లలు ఒకే స్కూల్లో చదివే కామన్ స్కూలింగ్ సిస్టమ్ ఉండాలి. దానికి తగినట్టుగా ఆధునిక మౌలిక వసతులు, ఉపాధ్యాయ శిక్షణ, పెట్టుబడుల పెంపు అవసరం. ‘క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ – నాట్ ఫర్ ది ప్రివిలేజ్డ్’ అన్నది మన మార్గదర్శక సూత్రం కావాలి.
చైనాలో విద్యావ్యవస్థ ద్వారా అన్ని వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నందున వారు ఆర్థిక వ్యవస్థకు భారీగా దోహద పడుతున్నారు.
-డా. మేడా జగన్మోహన రావు
వ్యాసకర్త విద్యారంగ నిపుణులు


