మిల్లెట్స్‌ స్నాక్స్‌! | Demand for healthy snacks | Sakshi
Sakshi News home page

మిల్లెట్స్‌ స్నాక్స్‌!

Sep 30 2025 1:21 AM | Updated on Sep 30 2025 1:21 AM

Demand for healthy snacks

ఆరోగ్యకరమైన చిరుతిళ్లకు డిమాండ్‌

ప్రత్యేక ఆసక్తి చూపుతున్న యువతరం

ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న బ్రాండ్స్‌

మనదేశంలో పట్టణాల్లో ఉంటున్నవారు క్రమంగా ఆరోగ్యకరమైన స్నాక్స్‌ వైపు మళ్లుతున్నారు. మఖానా వెంటపడ్డ కస్టమర్లు ఇప్పుడు జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, సామల వంటి చిరుధాన్యాలతో తయారైన ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు. స్థానిక ఔత్సాహిక వ్యాపారులే కాదు, ప్రముఖ బ్రాండ్స్‌ సైతం ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి.  – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌


దేశంలో ఆరోగ్య స్పృహ ఉన్న యువ జనాభా పెరుగుతోంది. 15–35 సంవత్సరాల వయసున్న వినియోగదారులు.. మామూలు భోజనమే కాదు, చిరుతిళ్ల విషయంలోనూ ఆరోగ్యకరమైనవేనా కాదా అని చూస్తున్నారు. ఆరోగ్యకరమైన చిరుతిళ్ల (స్నాక్స్‌) విపణి 2026 నాటికి 30 బిలియన్  డాలర్లకు పెరగవచ్చని ఆర్థిక సలహా సంస్థ అవెండస్‌ గత ఏడాది ఓ నివేదిక విడుదల చేసింది.

ఒకదాని వెంట ఒకటి..
మిల్లెట్స్‌ ఆధారిత ఉత్పత్తులు ఎక్కువగా అల్పాహారానికి పరిమితం అయ్యాయి. టాటా సోల్‌ఫుల్‌.. పిల్లల కోసం రాగి ఆధారిత తృణ ధాన్యాలకు ప్రసిద్ధి. కాలక్రమేణా మిల్లెట్‌ మ్యూస్లీ, రెడీ–టు–కుక్‌ ఓట్స్‌ను విడుదల చేసింది. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే పెద్దల కోసం రెడీ–టు–కుక్‌ మసాలా మిల్లెట్స్‌ సైతం మారికో విక్రయిస్తోంది. మనదేశం 2023ను ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించిన తర్వాత మిల్లెట్స్‌ ఆధారిత ఉత్పత్తులకు ప్రజాదరణ మరింత పెరిగింది. 

ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ విభాగం లెక్కల ప్రకారం.. చిరుధాన్యాల రంగంలో భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు. 2023లో ప్రపంచ ఉత్పత్తిలో మనవాటా 38.4 శాతం. అలాగే రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచిందని 2023–24 బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా మిల్లెట్‌ ఆధారిత 151 అగ్రిస్టార్టప్‌లు ఏర్పాటయ్యాయని ఇటీవల లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది.

పెద్ద బ్రాండ్స్‌ వస్తే..
అయితే పెద్ద స్నాకింగ్‌ బ్రాండ్ల పోర్ట్‌ఫోలియోలో మిల్లెట్స్‌ ఇంకా విస్తరించలేదు. ప్రస్తుతానికి ఈ ఉత్పత్తులు ప్రీమి­యం విభాగంలో ఉన్నాయి. చిరుధాన్యాలతో తయారైన ఉత్పత్తులు గ్లూటెన్, అలర్జీ రహితం. తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కలిగినవి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. 

ఈ విభాగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 10 సంవత్సరాల క్రితం సేంద్రియ ఉత్పత్తుల మాదిరిగా.. రాబో­యే కాలంలో ఇవి ప్రధాన స్రవంతిలోకి వస్తాయని పరిశ్రమ అంటోంది. పెద్ద బ్రాండ్స్‌ ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తే వినియోగం గణనీయంగా పెరుగుతుందన్నది నిపుణుల మాట. 

ముందున్న సవాల్‌..
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో వినియోగదారులు చాక్లెట్లను ఇష్టపడతారు. భారత్‌లో ఎక్కువగా.. ఉప్పుతో చేసిన వేయించిన స్నాక్స్‌ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మనదేశంలో ఈ విభాగంలో ఎక్కువగా అమ్ముడయ్యే ఉత్పాదన ‘భుజియా’. 

సింగపూర్‌కు చెందిన టెమాసెక్‌ ఈ ఏడాది మార్చిలో హల్దిరామ్‌ స్నాక్స్‌ ఫుడ్స్‌లో 10% వాటాను దాదాపు 1 బిలియన్  డాలర్లకు కొనుగోలు చేసింది. దీన్నిబట్టి స్నాక్స్‌కు ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ప్రధాన బ్రాండ్లు తమ ఉత్పత్తి శ్రేణిలో చిరుధాన్యాలను చేర్చడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను చేరడానికి ప్రయత్నిస్తున్నాయి. 

మఖానా.. మజాకా..
ఆరోగ్యకరమైన స్నాక్స్‌ మార్కెట్‌లో మార్పునకు మఖానా నాయకత్వం వహిస్తోందని ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ (ఐబీఈఎఫ్‌) చెబుతోంది. ప్యాకేజ్డ్‌ మఖానా మార్కెట్‌ రాబోయే 2–3 ఏళ్లలో ఒక బిలియన్  డాలర్లకు చేరుతుందని వ్యాపారుల అంచనా. ప్ర­స్తు­తం దేశంలో 80,000 టన్నుల మఖానా పండుతోందని సమాచారం. దీని విలువ హోల్‌సేల్‌ మార్కె­ట్లో 700 మిలియన్  డాలర్లు. మఖానా పరిశ్రమను ప్రోత్సహించేందుకు 2025–26 బడ్జెట్‌లో రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 

మార్కెట్‌ విలువ రూ. 42 వేల కోట్లకుపైనే!
కోవిడ్‌–19 సమయంలో అందరికీ ఆరోగ్య స్పృహ పెరగడంతో.. సంప్రదాయ ఆరోగ్య ఉత్పత్తులవైపు మళ్లారు. ఇది చిరు ధాన్యాల వినియోగాన్ని పెంచేందుకు దోహదపడింది. 

» భారత స్నాక్స్‌ మార్కెట్‌ 2023 నాటికి రూ.42,695 కోట్లు. 2032 నాటికి ఇది రూ.95,522 కోట్లకు చేరుకుంటుందని అంచనా. 
»  2024–32 మధ్యకాలంలో 9.08% వార్షిక వృద్ధి రేటుతో ఆరోగ్యకరమైన స్నాక్స్‌ విపణి విస్తరిస్తుందని పరిశోధనా సంస్థ ఐఎంఏఆర్‌సీ గ్రూప్‌ అంటోంది. 
»   చిరుతిళ్లు, ధాన్యాలు, పప్పుల వంటి వాటి విక్రయంలో ఉన్న ‘ఫామ్‌లీ’ ఈ ఏడాది చేపట్టిన సర్వేలో 6,000 మంది భారతీయ వినియోగదారులు పాలుపంచుకున్నారు. అధిక ప్రొటీన్, శక్తి వంటి ప్రయోజనాలు అందించే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ కోసం కస్టమర్లు ఎక్కువగా చూస్తున్నారని ఈ సర్వేలో తేలింది. 
» ‘రూకమ్‌ క్యాపిటల్‌’ సంస్థ దేశంలోని 18 రాష్ట్రాల్లో 5,000 మందిపై నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో.. చిరుధాన్యాలు, డ్రైఫ్రూట్స్‌ వంటి వాటితో చేసిన ఆరోగ్యకరమైన స్నాక్స్‌ కావాలని సగానికిపైగా చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement