ఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఒక సీనియర్ మహిళా అడ్వకేట్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మే 22, మే 27 తేదీలలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని సమావేశమైన కొలీజియం బృందం ఈ నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టు కోలిజియం సిపార్సు చేసిన న్యాయమూర్తులు
జస్టిస్ శీల్ నాగు, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
జస్టిస్ శ్రీ చంద్రశేఖర్. బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
జస్టిస్ సంజీవ్ సచ్దేవా ,మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
జస్టిస్ అరుణ్ పల్లి , జమ్మూ కాశ్మీర్ ,లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
వి. మోహన (సీనియర్ అడ్వకేట్): సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక సీనియర్ మహిళా న్యాయవాది.
సీనియర్ అడ్వకేట్ వి. మోహనను నేరుగా బార్ (న్యాయవాది వృత్తి) నుండి సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపిక చేయడం విశేషం. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేవలం ఒకే ఒక మహిళా జడ్జి (జస్టిస్ బి.వి. నాగరత్న) ఉన్నారు. మోహన నియామకం జరిగితే కోర్టులో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది. రిటైర్డ్ జస్టిస్ ఇందు మల్హోత్రా తర్వాత బార్ నుండి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందుతున్న రెండో మహిళా న్యాయవాదిగా ఆమె గుర్తింపు పొందుతారు.
దేశంలో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను (CJI తో కలిపి) 38 కి పెంచింది. ప్రస్తుతం కోర్టులో 32 మంది జడ్జీలు విధులు నిర్వహిస్తున్నారు. కొలీజియం సిఫార్సు చేసిన ఈ ఐదుగురి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37 కి చేరుకుంటుంది.


