‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్‌’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి? | CJPs X Handle Blocked In India After Outpacing BJP On Instagram | Sakshi
Sakshi News home page

‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్‌’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?

May 21 2026 1:54 PM | Updated on May 21 2026 2:32 PM

CJPs X Handle Blocked In India After Outpacing BJP On Instagram

న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఊహించని రీతిలో దూసుకుపోతున్న ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార బీజేపీ అధికారిక ఖాతా కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు సృష్టించిన కొద్ది గంటల్లోనే, ఈ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో బ్లాక్‌ అయ్యింది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బీజేపీని దాటేసిన క్రేజ్!
కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 10 మిలియన్ల (కోటి) ఫాలోవర్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం 8.7 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న బీజేపీ అధికారిక ఇన్‌స్టా ఖాతాను ఇది అధిగమించింది. కాంగ్రెస్ 13 మిలియన్ల ఫాలోవర్లతో ముందుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా వెనుకబడి ఉంది. ఈ మైలురాయిని అందుకున్న కొన్ని గంటల్లోనే ‘సీజేపీ’ ఎక్స్ అకౌంట్‌ను భారత్‌లో బ్లాక్ చేశారు. ‘మేము ఊహించినట్టే జరిగింది’ అంటూ ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ స్పందించారు.

సుప్రీం వ్యాఖ్యల నుండి పుట్టిన ఉద్యమం
నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, రాజకీయాలపై విసుగు చెందిన జెన్-జీ యువత ఆవేదన నుండి పుట్టిన పొలిటికల్ సెటైర్ మూవ్‌మెంట్ ఇది. గత వారం ఒక కోర్టు విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగులు, ఆన్‌లైన్ యాక్టివిస్టులను ఉద్దేశించి ‘బొద్దింకలు’,'పరాన్నజీవులు' అని వ్యాఖ్యానించారనే వార్తలతో ఈ ఉద్యమం మొదలైంది. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ, యువత ఈ వినూత్న పార్టీని స్థాపించారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, నకిలీ డిగ్రీల వారినే తానలా అన్నానని సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు.

సెలబ్రిటీల మద్దతు.. భారీ నెట్‌వర్క్
బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, మాజీ ఆప్ సోషల్ మీడియా కార్యకర్త అయిన 30 ఏళ్ల అభిజీత్ దిప్కే ఈ వినూత్న మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ’ అనే నినాదంతో, కేవలం హాస్యం, మీమ్స్ ఆధారంగా యువతను ఇది విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వైవిధ్యమైన డిజిటల్ ప్రచారానికి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్, టీఎంసీ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా మద్దతు తెలపడం విశేషం.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement