ఢిల్లీ: సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.70గా నమోదైంది. గతేడాది 93.66 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 94.99శాతం ఉండగా బాలురుది 92.69శాతంగా ఉంది.
ప్రాంతాల వారీగా చూస్తే త్రివేండ్రం అత్యధికంగా 99.79శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సంస్థల వారీగా చూస్తే కేంద్ర విద్యాలయాలు (KV) అత్యుత్తమ ఫలితాలను సాధించాయి. వీటి ఉత్తీర్ణత శాతం 99.57శాతంగా నమోదైంది. ఫలితాల తర్వాత సప్లమెంటరీ పరీక్షలు మే మధ్యలో ప్రారంభం కానున్నాయి. అలాగే లిస్ట్ ఆఫ్ కాండిడేట్స్ విండో ఏప్రిల్ 16 నుండి 20 వరకు అందుబాటులో ఉంటుంది.
గతంలో ఫలితాల సమయంలో వెబ్సైట్లు మొరాయించడం, సర్వర్లు డౌన్ వంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యేవి. ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా ఫలితాలను విద్యార్థులు నేరుగా స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేలా డిజీలాకర్, ఉమాంగ్ యాప్స్లలో అందుబాటులోకి తెచ్చింది. తద్వారా విద్యార్థులు తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే కేవలం నిమిషాల వ్యవధిలో స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.


