‘సరిహద్దు ఉద్రిక్తత.. యుద్ధం రాదని చెప్పలేం’ | Bipin Rawat India Will Not Accept Any Shifting of LAC  | Sakshi
Sakshi News home page

భారత్‌-చైనా‌ చర్చలు.. రావత్‌ కీలక వ్యాఖ్యలు

Nov 6 2020 2:30 PM | Updated on Nov 6 2020 2:45 PM

Bipin Rawat India Will Not Accept Any Shifting of LAC  - Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని.. చైనాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి రాదని చెప్పలేము అన్నారు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇరు దేశాల మధ్య ఎనిమిదవ రౌండ్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరగనున్న నేపథ్యంలో రావత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా రావత్‌ మాట్లాడుతూ.. ‘తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితులు ఉద్రిక్తతంగానే ఉన్నాయి. లద్దాఖ్‌లో పెను సాహసానికి పాల్పడిన పిపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఊహించని ఫలితాలు చవి చూడాల్సి వచ్చింది. మన దళాలు చైనా ఆర్మీ చర్యలను ఎంతో ధృడంగా ఎదుర్కొన్నాయి’ అని తెలిపారు. ‘మొత్తం భద్రతా చర్యల్లో భాగంగా సరిహద్దు ఘర్షణలు, అతిక్రమణలు, ప్రేరేపించని వ్యూహాత్మక సైనిక చర్యలు వంటి కవ్వింపు చర్యలతో సరిహద్దులో ఒక పెద్ద సంఘర్షణ తలెత్తింది. దీన్ని తేలికగా తీసుకోలేము’ అన్నారు. ఇక భద్రతా సవాళ్ల గురించి మాట్లాడుతూ.. అణ్వాయుధ సంపత్తి కల రెండు పొరుగు దేశాలతో నిరంతర ఘర్షణ తప్పదని.. ఫలితంగా ప్రాంతీయ వ్యూహాత్మక అస్థితరకు దారి తీసే అవకాశం ఉందన్నారు. యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇరు దేశాలతో భారత్‌ ఎంతో సమన్వయంగా వ్యవహరిస్తుందని అన్నారు రావత్‌. (చదవండి: భారత సైన్యం కీలక నిర్ణయం..!)

అలానే సీమాంతర ఉగ్రవాదంపై కూడా స్పందించారు రావత్‌. పాకిస్తాన్‌‌ సరిహద్దు ఉగ్రవాద చర్యలను భారత రక్షణ దళాలు బలంగా తిప్పి కొడతాయని తెలిపారు. ‘ఉడి, బాలాకోట్‌ ప్రాంతంలో చేసిన సర్జికల్‌ స్ట్రైయిక్స్‌తో పాక్‌కు గుణపాఠం నేర్పాము. ఇక దాయాది దేశం మన భూభాగంలోకి ఎల్‌ఓసీ వెంబడి ఉగ్రవాదులను పంపించాలంటే భయపడుతుంది’ అన్నారు. జమ్ము కశ్మీర్‌లో పాక్‌, భారత్‌ వ్యతిరేక ప్రచారంతో పరోక్ష యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయని రావత్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement