‘పచ్చందనమే పచ్చదనమే’.. గార్డెన్‌ సిటీకి పూర్వ వైభవం | Bengalurus New Ecological Park A Breath of Fresh Air | Sakshi
Sakshi News home page

‘పచ్చందనమే పచ్చదనమే’.. గార్డెన్‌ సిటీకి పూర్వ వైభవం

Jan 3 2026 12:22 PM | Updated on Jan 3 2026 12:57 PM

Bengalurus New Ecological Park A Breath of Fresh Air

కాంక్రీట్ జంగిల్‌లో ఉంటున్న ఆ నగరవాసులకు ఇది నిజంగా తీపి కబురే.. దాదాపు ఒకటిన్నర శతాబ్దాల నిరీక్షణ తర్వాత బెంగళూరు తన కిరీటంలో మరో పచ్చని రత్నాన్ని అలంకరించుకోబోతోంది. నగర శివార్లలోని యెలహంక సమీపంలో 153 ఎకరాల విస్తీర్ణంలో భారీ పర్యావరణ ఉద్యానవనాన్ని (Eco-Park) ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కేవలం ఒక పార్కు మాత్రమే కాదు.. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించే ‘పచ్చందనమే పచ్చదనమే’ అనేలా మారబోతోంది.

చారిత్రక పునరుజ్జీవనం
బెంగళూరు చరిత్రలో 1870లో కబ్బన్ పార్క్, ఆ తర్వాత లాల్‌బాగ్ (240 ఎకరాలు) ప్రధాన ఆకుపచ్చని ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇంతటి భారీ స్థాయిలో ఒక పర్యావరణ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. మాదప్పనహళ్లిలో నిర్మించబోయే ఈ 153 ఎకరాల పార్క్.. నగరం కోల్పోయిన ‘గార్డెన్ సిటీ’ హోదాను తిరిగి తీసుకురావడంలో కీలక మైలురాయిగా మారనున్నదని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.

వారసత్వం- వైవిధ్యం
ఈ పర్యావరణ ఉద్యానవనం కేవలం చెట్లకు మాత్రమే పరిమితం కాకుండా, సంస్కృతిని,  జీవవైవిధ్యాన్ని ప్రతిబింబించేలా మూడు ప్రధాన విభాగాలుగా రూపుదిద్దుకోనుంది.

బసవన్న మెడిసినల్ గ్రోవ్: ఇక్కడ ప్రాచీన భారతీయ వైద్య విధానాల్లో ఉపయోగించే అరుదైన మూలికా మొక్కలను పెంచనున్నారు.

అంబేద్కర్ బర్డ్ పార్క్: పక్షుల కిలకిలా రావాలతో అలరించే ఈ జోన్, స్థానిక, వలస పక్షులకు సురక్షిత ఆశ్రయంగా మారనుంది.

కెంపెగౌడ మినీ జూ: నగర వ్యవస్థాపకులు కెంపెగౌడ పేరు మీద ఏర్పాటు చేయనున్న ఈ జూలో జంతుజాలంపై అవగాహన కల్పించే ప్రదర్శనలు ఉంటాయి.

తెలంగాణ ‘హరితహారం’.. ఒక మార్గదర్శి
ఆకుపచ్చని కవచాన్ని పెంపొందించడంతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ‘హరితహారం’ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మొక్కలు నాటడమే కాకుండా, పట్టణ ప్రాంతాల్లో ‘అర్బన్ ఫారెస్ట్ పార్కులను’ అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలను పార్కులుగా మార్చడంతో  నగరంలో కాలుష్య స్థాయిలు తగ్గడమే కాకుండా, ప్రజలకు ఆహ్లాదకరమైన వినోద కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా పచ్చని పోరాటం
పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు భారత్‌లోని వివిధ రాష్ట్రాలు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ‘పైకప్పులపై పచ్చదనం (Rooftop Greening)ను ప్రోత్సహిస్తుండగా, రాజస్థాన్ ప్రభుత్వం క్షీణిస్తున్న ఆరావళి పర్వత శ్రేణులను కాపాడేందుకు ‘ఆరావళి గ్రీన్ వాల్’ ప్రాజెక్టును చేపట్టింది. అలాగే కేరళలో మడ అడవుల సంరక్షణ, తమిళనాడులో పురాతన ఆలయ కోనేరుల పునరుద్ధరణ తదితర చర్యలు పర్యావరణ సమతుల్యతకు ఎంతగానో తోడ్పడుతున్నాయి.

గ్రీన్ ఇండియా మిషన్ 
జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘గ్రీన్ ఇండియా మిషన్’ను 2025లో మరింత పటిష్టం చేసింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా ఐదు మిలియన్ హెక్టార్ల క్షీణించిన భూములను అడవులుగా మార్చడం దీని ప్రధాన ఉద్దేశ్యం. తద్వారా 2.5 నుండి 3 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను (CO2) పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బెంగళూరు ఎకో పార్క్ వంటి ప్రాజెక్టులు ఈ జాతీయ లక్ష్యానికి ఊతమిస్తాయి.

ఇది కూడా చదవండి: బుల్లెట్ రైలు స్పీడుకు ఖర్చుల బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement