చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్లు తగులుతున్నాయి. మరో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఇప్పటికే ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంబసముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా.. అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్కు రాజీనామా సమర్పించారు. ఆయన టీవీకేలో చేరే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు శిబిరాలుగా విడిపోవడం తెలిసిందే. మొత్తం 47 మందికిగాను పళణి స్వామి వర్గంలో 22 మంది, సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో శాసనసభా పక్షం, విప్ హోదాపై వివాదం కొనసాగుతోంది.
ఈ పరిస్థితుల్లో తిరుగుబాటు బృందంలోని మరగతం కుమరవేల్, సత్యభామ, జయకుమార్ అనే ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు రాజీనామా లేఖలను సమర్పించారు. వాటిని ఆయన వెంటనే ఆమోదించడం, టీవీకే ముఖ్య నేత, మంత్రి ఆధవ్ అర్జున సమక్షంలో ఆ పార్టీలో చేరడం చకచకా జరిగిపోయాయి. ఈ నెల 13వ తేదీన అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో పార్టీ విప్ను ధిక్కరిస్తూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయడం గమనార్హం.



