కర్ణాటక: పాగల్ ప్రేమికుని వ్యవహారం తీవ్ర రచ్చకు కారణమైంది. ప్రియురాలు పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి నానా రభస సృష్టించాడు. ఈ సంఘటన బెంగళూరు శివార్లలో ఆనేకల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక చిన్నయ్యనపాళ్యకు చెందిన సోమశేఖర్ అనే యువకుడు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కారు. మూడేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆమె ఇప్పుడు ప్రేమ, పెళ్లికి తిరస్కరించిందని బాధితుడు తెలిపాడు. జనం అతన్ని కిందకు దిగమని కేకలు వేసినా దిగేది లేదని చెప్పాడు. ఇది తెలిసి విద్యుత్ సిబ్బందిని కరెంటును నిలిపివేసి ఆనేకల్ పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు ఎంతగా అతన్ని కోరినా.. ప్రియురాలు ఇక్కడికి వచ్చేవరకు దిగేది లేదని సోమశేఖర్ గట్టిగా కేకలు వేశాడు.
యువతిని రప్పించి
దీంతో పోలీసులు సదరు యువతిని తాళి, పసుపు కుంకుమ తీసుకుని రావాలని చెప్పగా ఆమె, తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. నీ ప్రియురాలు వచ్చిందని, ఆమెతో వివాహం బాధ్యత తమదే అని, నిన్ను ఎవరూ ఏమి చేయరు, కిందికి వచ్చేయాలని మైకులో పోలీసులు ప్రకటించారు. అయితే అతనికి టవర్ను ఎక్కినంత సులువుగా దిగడానికి రాలేదు. తాడు కట్టి కిందకు దిగడానికి సహాయం చేశారు. చివరకు క్షేమంగా దిగడంతో కథ సుఖాంతమైంది. సోమశేఖర్ అంతకుముందే ఇంటి పైకెక్కి షీట్లు పగలగొట్టి హంగామా చేశాడని స్థానికులు తెలిపారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.


