అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలా.. వద్దా? | AAP Starts Public Poll On Whether Arvind Kejriwal Should Resign As CM Or Not If Arrested - Sakshi
Sakshi News home page

అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలా.. వద్దా?

Dec 1 2023 10:06 PM | Updated on Dec 2 2023 11:38 AM

AAP Starts Public Poll On Arvind Kejriwal Should Resign Or Not - Sakshi

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు అయితే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా.. వద్దా అనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఢిల్లీలో ఇంటింటికీ 'మై బీ కేజ్రీవాల్' సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది.  స్థానిక మంత్రి గోపాల్ రాయ్ తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.

"ఈ రోజు మొదటి రోజు. లక్ష్మీ నగర్ నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించాం. ప్రజలతో మాట్లాడాం. సీఎం కేజ్రీవాల్ ప్రజల కోసం చాలా పని చేశారని వారు చెప్పారు. ఉచితంగా కరెంటు, మంచినీరు, వైద్యం, విద్య, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు వంటి సౌకర్యాలు కల్పించారని, అందుకే రాజీనామా చేయకుండా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు గట్టిగా అభిప్రాయపడ్డారు" అని మంత్రి గోపాల్‌ రాయ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ గత నెలలో విచారణకు పిలిచింది. అయితే కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరుకాలేదు.  ఇది "చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితం" అంటూ నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

‘లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. మేం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి అరెస్టు జరిగితే కేజ్రీవాల్ రాజీనామా చేయాలా లేక జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలా అనే విషయాన్ని ప్రజలనే అడిగాం’ అని రాయ్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి 20వ తేదీ వరకు మొత్తం 2600 పోలింగ్ స్టేషన్లలో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తామని, డిసెంబర్ 21 నుంచి 24 వరకు మొత్తం 250 వార్డుల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని రాయ్ తెలిపారు. ఏం చేయాలన్నది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement