26కి చేరిన మృతుల సంఖ్య

15 Dead In Landslide In Kerala After Heavy Rain - Sakshi

కేరళలో కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇడుక్కి: కేరళలోని ఇడుక్కి జిల్లాలో తేయాకు కార్మికుల ఇళ్ళపై కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరింది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఎన్డీఆర్‌ఎఫ్‌కి చెందిన రెండు బృందాలతో కలిసి ఆ ప్రాంతమంతా గాలిస్తున్నారు. రక్షణ చర్యలకు భారీగా కురుస్తోన్న వర్షాలు ఆటంకంగా మారాయి. జిల్లా అధికారుల అంచనా ప్రకారం ఇంకా 46 మంది కనిపించకుండా పోయారు.

ఇన్ని అవాంతరాల మధ్య అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయకార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారని ఇడుక్కి జిల్లా కలెక్టర్‌ హెచ్‌.దినేషన్‌ తెలిపారు. ఇప్పటికే 12 మందిని రక్షించినట్లు చెప్పారు.  55 మంది సిబ్బందితో రక్షణ, పునరావాస కార్యకలాపాలను చేపట్టినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ దక్షిణాది చీఫ్‌ రేఖా నంబియార్‌ చెప్పారు. గత 24 గంటల్లో సగటున 9.5 సెంటిమీటర్ల వర్షపాతం, అత్యధికంగా కోళీకోడ్‌లోని వడకరలో 32.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మంగళూరు ఎయిర్‌పోర్టు మూత
శివాజీనగర: కుంభవృష్టి నేపథ్యంలో కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. మళ్లీ ఆదేశాలు వచ్చేవరకు తెరవబోమని అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలకు సాంకేతిక కారణాలు తోడవటంతో కోళీకోడ్‌ విమానాశ్రయంలో దుర్ఘటన సంభవించటం తెలిసిందే. ఇది టేబుల్‌ టాప్‌ విమానాశ్రయం కావటంతో వర్షాల సమయంలో ల్యాండింగ్‌ సమస్యాత్మకమే. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top