నారాయణపేట రూరల్: జిల్లాలో సోమవారం పదోతరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. మొత్తం 43 కేంద్రాల్లో 8,319 మంది విద్యార్థులకుగాను 8,306 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 13 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ పరీక్ష కేంద్రంలో 11 మందికి 11 మంది పరీక్ష రాశారు. ఈ నెల 18న జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష పేపర్ నిజామాబాద్లో లీక్ కావడంతో విద్యాశాఖ సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో ఉదయం కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించే సమయంలో విస్తృతంగా తనిఖీ చేశారు. పరీక్ష ప్రారంభం నుంచి సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు కేంద్రాలను జల్లెడ పట్టాయి. జిల్లా విద్యాధికారి గోవిందరాజు, పరీక్షల విభాగం అధికారి శశికుమార్ కేంద్రాలను తనిఖీ చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరిశీలించి సీఎస్, డీఓలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫోన్లను అనుమతించరాదని సూచించారు. మరోపక్క ఎస్పీ వినీత్ పరీక్షా కేంద్రాల దగ్గర బందోబస్తును పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని ఆదేశించారు.


