మూడో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: జిల్లాలో ఈ నెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా సోమవారం కలెక్టర్ చాంబర్లో మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ, ఊట్కూరు మండలాల పోలింగ్ సిబ్బంది మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు. మండలాల వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ నాటికే ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలతో కూడిన గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరపాల్సిన అవసరం లేకపోవడం వల్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు కల్పించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. మూడో విడతలో 920 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 20 శాతం అదనంగా సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీపీఓ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచే ప్రచార కార్యక్రమాలు నిషేధమని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో ఎవరూ కూడా బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలు, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు.


