ఆశలకు ‘గండి’.. | - | Sakshi
Sakshi News home page

ఆశలకు ‘గండి’..

Nov 7 2025 7:45 AM | Updated on Nov 7 2025 7:45 AM

ఆశలకు

ఆశలకు ‘గండి’..

తరచుగా కోతకు గురవుతున్న కేఎల్‌ఐ కాల్వలు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన సాగునీటి కాల్వల నిర్వహణ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం కాల్వల నిర్మాణం చేపట్టగా.. ఇప్పటివరకు కాంక్రీట్‌ లైనింగ్‌కు నోచుకోలేదు. ఫలితంగా నీటి ప్రవాహానికి తరచుగా కాల్వలు తెగుతున్నాయి. దీంతో సమీపంలోని రైతుల పంటపొలాలను వరద ముంచెత్తి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కాల్వలు చెంతనే ఉన్నాయన్న ఆశతో పంటలు వేసుకుంటున్న రైతులకు కన్నీరే మిగులుతోంది. పంటలు చేతికొచ్చే సమయంలో కాల్వలకు గండ్లు పడి పంటంతా నీటిపాలవుతోంది. ఏటా ఇదే తంతు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లోని కొల్లాపూర్‌, పెద్దకొత్తపల్లి, కోడేరు, కల్వకుర్తి, వెల్దండ, పాన్‌గల్‌ మండలాల్లో తరచుగా కాల్వలు తెగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

అడుగడుగునా గండ్లతో నష్టం..

కేఎల్‌ఐ కాల్వకు ఒకే చోట ఆరుసార్లు గండి పడినా అధికారులు మాత్రం తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే నానాటికీ బలహీనమైన కాల్వ కట్టలకు తరచుగా గండ్లు పడి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి మండలం తోటపల్లి, వెంకటాపూర్‌, తిమ్మరాసిపల్లి, నెల్లికట్ట, వెల్దండ సమీపంలోని కేఎల్‌ఐ కాల్వ అధ్వానంగా తయారైంది. వనపర్తి జిల్లాలోని పాన్‌గల్‌, రేవల్లి మండలాల్లోని కేఎల్‌ఐ కాల్వలతో పాటు బీమా కాల్వకు పలు చోట్ల గండి పడటంతో రైతులు పెద్దసంఖ్యలో నష్టపోతున్నారు. పాన్‌గల్‌ మండలంలోని దావాజీపల్లి, బండపల్లి, శాగాపూర్‌, జమ్మాపూర్‌, మందాపూర్‌, బుసిరెడ్డిపల్లి గ్రామాల సమీపంలో కాల్వ తెగి రైతుల పొలాలు తరచుగా నీటమునుగుతున్నాయి.

నిధులు లేక నిర్వహణ గాలికి..

కేఎల్‌ఐ కాల్వల నిర్మాణం 2005లో చేపట్టగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం మరమ్మతులు, నిర్వహణకు నోచుకోవడం లేదు. సుమారు పదేళ్లుగా కాల్వలను అధికారులు గాలికి వదిలేశారు. ప్రతిసారి వేసవిలో కాల్వలకు మరమ్మతు చేపట్టి.. కాల్వ కట్టలను పటిష్టం చేయాల్సి ఉండగా, గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా మరమ్మతులు చేపట్టలేదు. కేఎల్‌ఐ కింద కేవలం చెరువులు, కుంటలు నింపడం.. ఉన్న కొద్దిపాటి కాల్వలకు సాగునీరందించేందుకే అధికారులు పరిమితమవుతున్నారు. పంపుహౌస్‌ల్లో మోటార్లకు సైతం మరమ్మతు చేయకపోవడంతో.. సరైన స్థాయిలో పంపింగ్‌ చేపట్టక చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు.

లైనింగ్‌ లేకపోవడమే కారణం..

కేఎల్‌ఐ కాల్వలకు తరచుగా గండ్లు పడటానికి, కాల్వ కట్టలు కోతకు గురవడానికి ప్రధాన కారణం లైనింగ్‌ నిర్మాణం చేపట్టకపోవడమేనని కారణమని రైతులు వాపోతున్నారు. కాల్వలకు ఇరువైపులా సిమెంట్‌ లైనింగ్‌ చేపట్టకపోవడంతో తరచుగా కోతలకు గురవుతున్నాయి. కేఎల్‌ఐ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కాల్వలకు లైనింగ్‌ చేయలేదు. కేవలం ఎల్లూరు నుంచి సింగోటం వరకు మాత్రమే కేఎల్‌ఐ ప్రధాన కాల్వకు లైనింగ్‌ పనులు చేసి.. ఆ తర్వాత కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారు. ప్రభుత్వం దృష్టిసారించి కేఎల్‌ఐ కాల్వలకు మరమ్మతు చేపట్టడంతో పాటు లైనింగ్‌ ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు.

భారీ వర్షాలకు

ఉధృతంగా నీటి ప్రవాహం

ఏటా ఏదో ఒక చోట తెగుతున్న కాల్వలు

సమీపంలోని పంటలు దెబ్బతిని రైతులకు భారీ నష్టం

పదేళ్లుగా ఇదే తీరు.. నిర్వహణ పట్టనిఅధికారులు

ఆశలకు ‘గండి’..1
1/2

ఆశలకు ‘గండి’..

ఆశలకు ‘గండి’..2
2/2

ఆశలకు ‘గండి’..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement