
సీపీఆర్తో ప్రాణాలు కాపాడొచ్చు
నారాయణపేట: గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చని, సీపీఆర్ విధానంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాలోని అన్ని లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వైద్యాధికారులకు ఎంఎల్హెచ్పీలకు సీపీఆర్పై వేర్వేరుగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సీపీఆర్ చేయడం, నేర్చుకోవడం వల్ల గుండెపోటుతో కారణంగా ఆగిపోయిన గుండెల్లో రక్తప్రసరణను మళ్లీ పెంపొందించడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణను ఉపయోగించుకోవాలని సూచించారు. సీపీఆర్ చేయడం నేర్చుకొని సగటు వ్యక్తి ప్రాణాన్ని కాపాడడానికి కృషి చేయాలని ఆరోగ్య శాఖలోని సిబ్బంది మాత్రమే కాకుండా సగటు మనిషి ఎవరైనా దీన్ని నేర్చుకోవచ్చని చెప్పారు. మహబూబ్నగర్ నుంచి వచ్చిన ఎంఐసీయూ డాక్టర్ రఘురెడ్డి సిపిఆర్పై శిక్షణ ఇచ్చారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వైద్యాధికారులు పర్యవేక్షకులకు, ఎమ్ఎల్హెచ్పిలకు సిపిఆర్ పై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్, ప్రోగ్రామ్ అధికారి సత్య ప్రకాష్, ఎన్సీడి కోఆర్డినేటర్ విజయ్ కుమార్, అరవింద్ కుమార్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.