
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం
నారాయణపేట రూరల్: ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా తపస్ కృషి చేస్తుందని తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేర్ కృష్ణారెడ్డి నరసింహ అన్నారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆ సంఘం జిల్లా స్థాయి అభ్యాస వర్గ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని, అన్ని గ్రామాల్లో ప్రైవేటు స్కూళ్లకు పిల్లలు వెళ్లకుండా స్థానికంగా ఉండే సర్కారు బడికే వచ్చే విధంగా చర్యలు చేపడదామన్నారు. ఆ లక్ష్యంగా జూన్ మాసాన్ని విద్యార్థుల నమోదు మాసంగా తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతోపాటు పాఠశాలల ప్రగతికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు కనీసం రెండు డీఏలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను అసంబద్ధమైన సర్దుబాటు చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరూ ఉపాధ్యాయులు ఉండే విధంగా చూడాలని, సంఖ్యకు తగ్గట్టుగా పాఠశాలలు ప్రారంభం నాటికే విద్యా వలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. జూమ్ మీటింగ్ల పేరుతో విద్యాబోధన సమయాన్ని వృథా చేయరాదని, హెడ్ మాస్టర్ లపై ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లాలోని ఉపాధ్యాయ సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలపై చర్చించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ గుంపు బాలరాజ్, జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లికార్జున్, జిల్లా మహిళా ప్రముఖ్ కెంచే విజయ, జిల్లా కోశాధికారి కిషోర్ కుమార్, జిల్లా, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.