నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 48 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు ఆయనకు వినతులు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
డీఈఈసెట్
స్పాట్ కౌన్సిలింగ్
రామగిరి(నల్లగొండ) : డీఈఈసెట్ – 2026 అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డీఎల్ఈడీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ ఫేజ్ – 2 నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహ తెలిపారు. నల్లగొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో మిగిలిన 2 సీట్ల భర్తీ కోసం ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రైవేట్ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 30న సంబంధిత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా రోస్టర్ కమ్ మెరిట్ ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తారని వెల్లడించారు. కళాశాలల వారీగా ఖాళీ సీట్ల వివరాల కోసం అభ్యర్థులు డీఈఈసెట్ 2026 అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని సూచించారు.
అమరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం
నార్కట్పల్లి : అమరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దామని అరుణోదయ సాంస్క్రతిక సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. సోమవారం నార్కట్పల్లి మండలంలోని పల్లెపహాడ్ గ్రామంలో పజ్జూరి కృష్ణారెడ్డి, భరత్, రాజుల వర్థంతుల సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. ప్రభుత్వాలను విమర్శించే ప్రతి ఒక్కరిని దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. అమెరికాతో భారత్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బొమ్మకంటి కొమురయ్య, ఇప్ప రామకృష్ణ, బంటు రామలింగయ్య, గొండ్యాల సైదులు, పల్లెబోయిన జానీ, బొడ్డు నాగరాజు, బాలస్వామి, గోపి, మామిడి ఎల్లయ్య, బాబు, లింగయ్య, మల్లేష్, వెంకన్న, రాము, లింగయ్య, బుచ్చయ్య, వెంకన్న, సత్తయ్య, ఉపేంద్ర, పోతుల రమేష్, రాకేష్ పాల్గొన్నారు.
సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి
రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీలో ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడంతో పాటు పెండింగ్ అలవెన్సులు, పీఆర్సీ ఏరియర్స్, సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని సీఐటీయూ, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోశాధికారి కె.ఎస్.రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యంతో జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాలను ఆలస్యం చేయకుండా తక్షణమే అమలు చేయాలని కోరారు. 2026 మే 21న జరిగిన చర్చల ప్రకారం అలవెన్సులను 80 శాతం పెంచి, ఈ జూలై జీతాల నుంచే చెల్లించాలి. కార్యక్రమంలో డిపో గౌరవాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, సీఐటీయూ నల్లగొండ పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, ఫెడరేషన్ రీజియన్ ఉపాధ్యక్షులు కె.చంద్రమౌళి, శ్యాంసుందర్, సిహెచ్.రేవతి, పి. వెంకటేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


