సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వానాకాలం వ్యవసాయ సీజన్ దగ్గర పడుతోంది. మబ్బులు కమ్ముకొస్తున్నాయి. అయినా యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. అకాల వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడం లేదు. లారీల కొరతతో నెలరోజుల క్రితం వచ్చిన ధాన్యం కూడా కల్లాల్లోనే ఉండిపోతోంది. దానికి తోడు కొందరు నిర్వాహకులే దళారులు అవతారం ఎత్తారు. కొనుగోలు కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యం కొనకుండా, తక్కువ ధరకు తామే కొనుక్కొని ఎక్కువ ధరకు మిల్లుకు విక్రయిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెనెలన్నర రోజులు దాటిపోయినా రైతులు తమ ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా? అంటూ ఎదురు చూడాల్సి వస్తోంది. మంగళవారం రాత్రి అక్కడక్కడా అకాల వర్షం పడడంతో ధాన్యం తడిచిపోయింది. మిగితా ప్రాంతాల్లోనూ అకాల వర్షాలు పడితే ధాన్యం తడిచిపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కొన్నది 6.96 లక్షల మెట్రిక్ టన్నులే..
జిల్లాలో 7.42 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం మార్కెట్కు వచ్చింది. అందులో 6.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లోనే ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా అంతకంటే ఎక్కువే ఉంటుందని రైతులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ లారీల సమస్య తీరడం లేదు. 820 లారీలు పెట్టామంటున్న జిల్లా పౌరసరఫరాల విభాగం చెబుతున్నా, లారీలు రాకపోవడం వల్లే ధాన్యం కొనడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోళ్లలో జాప్యంతో రైతుల ఆవేదన
ఫ ఇంకా కొనుగోలు కేంద్రాల్లో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం
ఫ రోజుల తరబడి ఎదురుచూపులే..
ఫ గాలివానకు తడిచిపోతున్న ధాన్యం
ఫ కాపాడుకునేందుకు అవస్థలు


