నల్లగొండ టూటౌన్ : సెనెట్ సభ్యుల సూచనలు సలహాలు మేరకు విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తామని ఎంజీయూ వైస్ చాన్స్లర్ (వీసీ) ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ)లో మంగళవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన అకడమిక్ సెనెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో విద్య, ఆర్థిక అంశాలను సమీక్షించి ఆమోదించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక లెక్కలు, 2025–26కు సంబంధించిన డ్రాప్టు బడ్టెట్, రివైజ్డ్ బడ్జెట్కు ఆమోదం తెలిపారు. కొత్తగా నియమితులైన డీన్, రిజిస్ట్రార్ నియామకాలు, పదోన్నతులు, అనుబంధ విద్యా విభాగాల బలోపేతానికి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి మరింత దోహదం చేయడానికి ఈ నిర్ణయాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. సమావేశంలో మాజీ వీసీ గంగాధర్, ప్రొఫెసర్లు కట్టా నర్సింహారెడ్డి, భాగ్యనారాయణ, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ప్రొఫెసర్ శ్రీదేవి, రేఖ, ఆకుల రవి, అల్వాల రవి, అన్నపూర్ణ, ఉపేందర్రెడ్డి, హరీష్కుమార్, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.


