నల్లగొండ : రాష్ట్ర మైనార్టీ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు ఎంట్రెన్స్ టెస్టు రాసే మైనార్టీ విద్యార్థులకు మైనార్టీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇవ్వనున్న ఉచిత కోచింగ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.విజయేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మైనార్టీలుగా పరిగణించబడతారని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 31లోగా ఆన్లైన్ వెబ్సైట్ https://cet.cgg.gov.in/tmreis ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష జూన్ 14న నల్లగొండలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉటుందని పేర్కొన్నారు.
బాల్య వివాహాలను నిర్మూలిద్దాం
నల్లగొండ : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మహిళా వారోత్సవాల సందర్భంగా మంగళవారం నల్లగొండలోని రెడ్క్రాస్ భవనంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిషేధ చట్టం–2006పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల అనేక మంది బాలికల జీవితాలు అంధకామవుతున్నాయన్నారు. విద్యార్థులు తమ ప్రాంతాల్లో జరిగే బాల్య వివాహాలపై పోలీసులకు, అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు సోషల్ మీడియాను అతిగా ఉపయోగించకుండా, ఏఐ ఫొటో మార్పింగ్ వంటి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే దరఖాస్తు చేసుకోండి..
చదువుకు ఆర్థిక ఇబ్బందులున్న విద్యార్థులు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. బాలికల సమస్యలపై ప్రతి నెల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రణామం వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను సందర్శించారు. వృద్ధులు క్యారమ్స్ ఆడుతుండగా ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సీడీపీఓ లావణ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ చింత కృష్ణయ్య, సభ్యులు భాస్కర్ వెంకన్న, డీసీపీఓ గణేష్ పాల్గొన్నారు.
30న ప్రత్యేక ప్రజావాణి
నల్లగొండ : నల్లగొండలోని కలెక్టరేట్లో ఈ నెల 30న దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిసున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి కేవీ.కృష్ణవేణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


