తుర్కపల్లి: మండలంలోని మాదాపూర్ గ్రామ శివారులో గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. సమాచారం మేరకు తుర్కపల్లి ఎస్ఐ మహమ్మద్ తఖియోద్దీన్ తన సిబ్బందితో కలిసి ఎల్లమ్మ గుడి సమీపంలో ఐదుగురు అనుమానితుల ను తనిఖీ చేశారు. ఈమేరకు తుర్కపల్లి మండలానికి చెందిన ఒగ్గుబాబు, జూకంటి సత్యం, ఒగ్గు నవీన్కుమార్, జూకంటి శివకుమార్, బొమ్మలరామారాం మండలం దీరా వత్ దేవేందర్ వద్ద 200 గ్రామల గంజాయి ఉండగా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. గంజాయిని కలకత్తా నుంచి కొనుగోలు చేసి మాదాపూర్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద బైక్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
దాబాలో నగదు చోరీ
చివ్వెంల(సూర్యాపేట) : మండల పరిధిలోని అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారి వెంట ఉన్న దాబాలో బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తి నగదు చోరీ చేశాడు. చివ్వెంల మండల కేంద్రానికి చెందిన కాసుల రామన్న అక్కలదేవిగూడెం గ్రామ శివారులో దాబా నిర్వహిస్తున్నాడు. అతను మంగళవారం రాత్రి 12 గంటల వరకు దాబాలో ఉండి అనంతరం ఇంటికి వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున వచ్చి చూసేసరికి కౌంటర్లో ఉన్న నగదు, సిగరెట్ ప్యాకెట్లు కనిపించలేదు. కౌంటర్లో ఉన్న రూ.13 వేల నగదు చోరీకి గురైందని వాపోయాడు. చోరీకి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డు కావడంతో బాధితుడు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్వర్ తెలిపారు.


