శాలిగౌరారం : ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేసినప్పుడే ప్రజల నుంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఆయన శాలిగౌరారం మండలంలోని వల్లాల, అడ్లూరు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ సంస్థలను తనఖీ చేశారు. మొదటగా వల్లాల గ్రామంలో వన నర్సరీని పరిశీలించారు. నర్సరీ నిర్వాహణ, మొక్కల పెంపకం, వనమహోత్సవ కార్యక్రమ ప్రణాళికలు తదితర అంశాలను సంబంధిత అంశాలను అడిగి తెలుసుకున్నారు. చెరువులో ఉపాధిహామీ పథకం కింద రూ.6 లక్షల అంచనాతో కూలీలకు 3వేల పనిదినాలు కల్పించేందుకు చేపట్టిన ఫిష్పాండ్లను పరిశీలించారు. ఉపాధి పనులు జరిగేచోట కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యాలను కల్పించాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డిని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో గల ప్రభుత్వ మోడల్స్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి స్కూల్లో బోధనాతీరు, మధ్యాహ్న భోజన నాణ్యత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కట్టెలపొయ్యిపై వంటలు చేయడాన్ని గమనించిన కలెక్టర్ వంటకు గ్యాస్ వినియోగించాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. అనంతరం అడ్లూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనఖీ చేశారు. అక్కడ గర్భిణులు, బాలింతలతో మాట్లాడి పౌష్టికాహార పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. వీఓ భవనాలు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్ట లక్ష్మివెంకట్రెడ్డి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూం ఇళ్ల పరిస్థితిని, మిషన్ భగీరథ నీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు, సీడీపీఓ ఆస్రాఅంజుమ్, సర్పంచ్లు భూపతి తిరుపతమ్మ, కట్ట లక్ష్మి, పీఆర్ఏఈ భరత్చంద్ర, ఏపీఓ జంగమ్మ, ఏపీఎం శంకరయ్య, పంచాయతీ కార్యదర్శులు కృష్ణయ్య, నరేందర్ ఉన్నారు.
కలెక్టర్ చంద్రశేఖర్


