హాలియా : మతిస్థిమితం సరిగ్గా లేని మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గుర్రంపోడు మండలంలోని మొసంగి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంగరాల వెంకటమ్మ (49) కుమారుడు శ్రీధర్ ఆరునెలల క్రితం మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె మనోవేదనకు గురై మతిస్థిమితం కోల్పోయింది. బుధవారం ఆమె ఇంటికి కొద్దిదూరంలో ఉన్న ఖాళీ స్థలంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వాళ్లు గమనించి అక్కడికి వెళ్లేలోపు ఆమె మృతిచెంది ఉంది. మతిస్థిమితం సరిగ్గా లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె పెద్ద కుమారుడు బొంగరాల శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా.. మృతురాలికి భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు.
యాదగిరీశుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభూ మూర్తులకు అభిషేకం చేపట్టి, సహస్ర నామార్చన చేపట్టారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాఢ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. రాత్రి సమయంలో శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవం చేపట్టి, ఆలయాన్ని మూసివేశారు.


