టీకాలను విధిగా వేయించాలి
నల్లగొండ అగ్రికల్చర్ : పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా పశువైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళశారం నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,25,869 తెల్లజాతి, 3,17,279 నల్లజాతి పశువులకు టీకాలను వేయనున్నారు. మూడు నెలల వయస్సు వయస్సు నిండిన వాటికి టీకాలను వేయడానికి జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 80 బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చింది. అవసరమైన టీకాలను జిల్లాకు తెప్పించి అన్ని పశు వైద్యశాలలకు పంపింది. టీకాల కోసం ఏర్పాటు చేసిన బృందాలు ఉదయం 8 గంటలకే ఆయా గ్రామాల్లో రైతుల కొట్టాలు, షెడ్లకు చేరుకుని టీకాలను వేయనున్నారు. టీకాలు వేసిన పశువుల కొమ్ములకు గుర్తుగా ఆకుపచ్చ రంగు వేస్తారు. టీకాలను వేసిన వాటి వివరాలను భారత్ పశుధన్ యాప్లో వెంటనే నమోదు చేయనున్నారు.
వ్యాధికి కారణాలు, నివారణ..
ఈ వ్యాధి వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఈ వ్యాధిని ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లేదా గాలికుంటు వ్యాధి అంటారు. ఈ వ్యాధి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందుల్లో కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి నివారణకు ప్రత్యేకమైన మందు లేదు. లక్షణాల ఆధారంగా చికిత్స చేస్తారు. గాయాలను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడగడం, యాంటి బయాటిక్స్, నొప్పి నివారణకు మందులు, విటమిన్ బి కాంప్లెక్స్ ఇవ్వడం, మృదువైన మేతను అందివ్వడం వంటి చర్యలు తీసుకుంటారు.
ఫ ఏప్రిల్ 9వ తేదీ వరకు కార్యక్రమం
ఫ జిల్లా వ్యాప్తంగా 3 లక్షల పశువులకు టీకాలు
ఫ టీకాల కోసం 80 బృందాల ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో రైతులు విధిగా తమ పశువులు, గేదెలకు టీకాలను వేయించాలి. రోగం రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తోంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ జీవి రమేష్,
జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి


