సేంద్రియ సాగుకు ప్రోత్సాహం
గుర్రంపోడు, కొండమల్లేపల్లి : సేంద్రియ, జీవన ఎరువులు వినియోగిస్తూ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. గురువారం ఆమె.. కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం గ్రామంలో జీవన ఎరువులతో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతు కట్టెబోయిన శ్రీనివాస్ బత్తాయి తోటను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. అలాగే జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలో బత్తాయి రైతులతో నాబార్డు సహకారంతో ఏర్పాటు చేయనున్న రైతు ఉత్పాదక సంస్థలపై నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో ఆమె మాట్లాడారు. సేంద్రియ, జీవన పద్ధతుల్లో పంట సాగు వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని, కొందరు రైతులు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేవలం 143 మంది ఉద్యానవన అధికారులు మాత్రమే ఉన్నారని, క్షేత్రస్ధాయిలో రైతులకు మరింతగా సేవలందించేందుకు వలంటీర్లను నియమించాలనే ప్రతిపాదన ఉందన్నారు. జిల్లాలోని బత్తాయి రైతులు మార్కెటింగ్ సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులు తీరుస్తామన్నారు. అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నామని పేర్కొన్నారు.
రైతులకు శిక్షణ ఇప్పించాలి :
ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ రాజిరెడ్డి
అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ (వీసీ) రాజిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2011లో లక్షపైగా ఎకరాల్లో బత్తాయి పంట సాగైతే ఇప్పుడు 41వేల ఎకరాలకు పడిపోయిందని గుర్తు చేశారు. విచక్షణారహితంగా పురుగుల మందు వాడకుండా సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులతో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయించి మిగతా వారికి శిక్షణ ఇప్పించాలన్నారు. ఆయా సమావేశాల్లో ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు, ఆర్గానిక్ ఫర్టిలైజింగ్ సర్టిఫికేషన్ డైరెక్టర్ కిరణ్కుమార్, నాబార్డు సీజీఎం ఆరిఫ్, డీడీఎం వినయ్కుమార్, ఉద్యాన శాఖ శాస్త్రవేత్త రాజాగౌడ్, జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి, అధికారులు పి.అనంతరెడ్డి, హెచ్ఓ మురళి, ఏఓ కె.మాధవరెడ్డి, ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
ఫ గుర్రంపోడు, కొండమల్లేపల్లిలో బత్తాయి క్షేత్రాల సందర్శన
ఫ ఆయా చోట్ల రైతులతో సమావేశాలు
సేంద్రియ సాగుకు ప్రోత్సాహం


