న్యాయవాది ఇంటిపై దాడి అమానుషం
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి న్యాయవాది జి.నరేష్ నివాసంలో ఆయన భార్యపై, చిన్న కూతురిపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడడం అమానుష చర్య అని నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, మంద నగేష్ అన్నారు. దాడిని ఖండిస్తూ గురువారం నల్లగొండ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి జిల్లా కోర్టు నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల చేవెళ్లలో మహిళా న్యాయవాదిని హత్య చేయడం, హైదరాబాద్లో మరో న్యాయవాదిపై హత్యాయత్నం, ఇప్పుడు నల్లగొండలో జరిగిన దాడి ఇవన్నీ న్యాయవాదుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల హక్కుల రక్షణ చట్టంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు జి.వెంకటేశ్వర్లు, ఎస్ఆర్.ఠాగూర్, జె.భాస్కర్రెడ్డి, ఎం.నాగిరెడ్డి, టి.కిషోర్కుమార్, పి.శేఖర్, జనిగల రాములు, జీఎన్ఎస్ ప్రసాద్, అన్నపూసల ఐలయ్య, బి.అశోక్ కుమార్, మేక యాదగిరిరెడ్డి, ఎం.ప్రమీల, ఎన్.భాగ్యమ్మ, టి.వరుణశ్రీ, ఎ.వెంకట్రెడ్డి, కొండ శ్రీనివాస్, బి.మధు, ముక్కెర శ్రీని వాస్, కామేష్, ఎంవి.రమేష్, సల్లా నరేష్, బి.సైదులు, బి.స్వామినాథ్తదితరులు పాల్గొన్నారు.


