రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి
భువనగిరిటౌన్ : వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చివరకు మరణంలోనూ తమ స్నేహబంధం వీడదీయరానిదంటూ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతిచెందారు. ఈ ఘటన భువనగిరి పట్టణ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన బాతుల రాకేష్ (20), జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాంతాపురం గ్రామానికి చెందిన గన్నె ఆనంద్ (19) ఫొటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు హైదరాబాద్లోని రామాంతాపూర్లో ఒకే రూంలో ఉంటున్నారు. రాకేష్ అమ్మమ్మ ఊరు కూడా శాంతాపురం కావడంతో వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులయ్యారు. వీరితో పాటు శాంతాపురం గ్రామానికే చెందిన మరో స్నేహితుడు సూర్యప్రసాద్ కూడా హైదరాబాద్లోనే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే మరొక రూంలో ఉంటున్నాడు. జనవరి 30న ఆనంద్ పుట్టినరోజు కాగా.. బర్త్డే వేడుకలను మేడారంలో జరుపుకోవాలని ముగ్గురు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాకేష్, ఆనంద్, సూర్యప్రసాద్ కలిసి జనవరి 29న రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరి శాంతాపురం గ్రామంలో ఆనంద్ బంధువుల వద్ద కారు తీసుకుని మేడారం వెళ్లారు. అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి శాంతపురం వచ్చి కారును అప్పగించి శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు కలిసి బైక్పై హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో భవనగిరి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఫ్లైఓవర్ పైకి బైక్ అదుపుతప్పడంతో వెనుక కూ ర్చున్న రాజేష్, ఆనంద్ బైక్ మీద నుంచి ఎగిరి ఫ్లైఓవర్పై నుంచి సర్వీసు రోడ్డుపై పడ్డారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ నడుపుతున్న సూర్యప్రకాష్ కొద్దిదూరం వెళ్లి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శనివారం మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ కె. రమేష్కుమార్ తెలిపారు.
ఫ మరొకరికి తీవ్ర గాయాలు
ఫ మరణంలోనూ వీడని స్నేహబంధం


