
ఆస్తి పన్ను వసూలుకు రెడ్ నోటీసులు
నోటీసులు జారీ చేస్తున్నాం
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టింది. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో 45 వేల వాణిజ్య, నివాస భవనాలు ఉన్నాయి. వీటన్నింటికి ఏడాది ఆస్తి పన్ను డిమాండ్ రూ.18 కోట్లు ఉంది. అయితే ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటి వరకు రూ.7.50 కోట్లు వసూలు కాగా వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా మిగతావి వసూలు చేయాల్సి ఉంది. కానీ వరుసగా వస్తున్న పండుగల నేపథ్యంలో ఆస్తి పన్ను చెల్లించేందుకు భవనాల యజమానులు ఆసక్తి చూపించడంలేదు. దీపావళి పండుగ ఉండడంతో ఈ నెలలో కూడా ఆస్తిపన్ను వసూలు కష్టమేనని తెలుస్తోంది. అయితే పాత బకాయిలు, ఈ ఏడాది ఆస్తి పన్ను కలిపి మొత్తంగా రూ.31కోట్లకు పైగానే వసూలు కావల్సి ఉంది. రానున్న ఆరు నెలల కాలంలో నెలకు రూ.5 కోట్లకుపైగా లక్ష్యంగా పెట్టుకొని వసూలు చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.
మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు..
నీలగిరి పట్టణంలో భవనాల యజమానులు కొందరు ఆస్తి పన్ను సక్రమంగా చెల్లించకుండా మొండికేస్తున్నారు. ఒక్కో భవనానికి కొందరు రూ.లక్షల్లో బకాయిలు పడ్డారు. దాంతో పాత బకాయిలే పట్టణంలో రూ.20 కోట్లకు పైగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పాత బకాయిల వసూలు కోసం మున్సిపల్ సిబ్బంది వెళ్లగానే సంబంధిత భవనాల యజమానులు స్థానిక రాజకీయ నాయకులు నుంచి ఫోన్లు చేయించి ఆస్తి పన్ను చెల్లించకుండా జాప్యం చేసుకుంటూ వస్తున్నారు. దాంతో కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. ఎక్కువ ఆస్తి పన్ను పడ్డ వారిలో 500 మందిని గుర్తించి వారికి రెడ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆస్తి పన్ను బకాయిలపై రెడ్ నోటీసులు జారీ చేయాలని స్థానిక సంస్థల కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దాంతో ఆ దిశగా మున్సిపల్ సిబ్బంది ముందుకు పోయేందుకు ఎక్కువ బకాయి ఉన్న జాబితా సిద్దం చేసే పనిలో పడ్డారు. రెడ్ నోటీసుల జారీ తరువాత కూడా బకాయి పన్ను చెల్లించకుంటే ఆస్తులను కూడా జప్తు చేయాలని మున్సిపల్ యంత్రాంగం భావిస్తోంది.ప్రత్యేకాధికారి పాలన కావడంతో సిబ్బంది రాజకీయ నాయకుల ఫోన్లను పట్టించుకునే అవకాశం తక్కువగానే ఉంటుంది. బకాయిలపై ఫోకస్ పెడితే 90 శాతం వరకు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది.
ఫ నీలగిరి మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ
ఫ ఇప్పటికే 500 మంది బకాయిదారుల గుర్తింపు
ఫ పాత బకాయిలు రూ.20 కోట్లకుపైనే పెండింగ్
ఫ ఈ ఏడాది వసూలు కావాల్సిన పన్ను రూ.11 కోట్లు
పాత బకాయిలు ఎక్కువగా ఉండి చెల్లించని 500 మందిని గుర్తించి రెడ్ నోటీసులు జారీ చేశాం. పన్ను బకాయిలు వెంటనే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి. పన్ను చెల్లించని బకాయిదారుల ఆస్తులను చట్ట ప్రకారం జప్తు చేస్తాం.
– సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్, నల్లగొండ