
నేడే విజయదశమి
రామగిరి(నల్లగొండ): దసరా వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆలయాలు, ప్రధాన కూడళ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు చేసుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. ప్రధానంగా దుర్గాదేవిని శక్తి స్వరూపిణిగా ఆరాధించడం ఈ పండుగ ప్రత్యేకత.
దుకాణాలలో కోలాహలం
జిల్లాలోని అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లోని దుకాణాలు, వివిధ మార్కెట్లు కొనుగోలుదారులతో కోలహలంగా మారాయి. జీఎస్టీ తగ్గడంతో బైకులు, కార్లు కోనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో బైకులు, ఎలక్ట్రికల్, వస్త్ర, ఫుట్వేర్, లేడీస్ ఎంపోరియం, పూలు, పండ్లు, కూరగాయల దుకాణాలు రాత్రి పొద్దుపోయే వరకు వినియోగదారులతో కిటకిటలాడాయి.
రహదారులపై వాహనాల రద్దీ
నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, హాలియా వంటి పట్టణాల్లో జాతీయ రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. షాపింగ్ చేసేందుకు ప్రజలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావడంతో పట్టణాల్లో ట్రాఫిక్ నెలకొంది. హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లేందుకు పయనం కావడంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ ఏర్పడింది. ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి.
రావణ దహనానికి భారీ కటౌట్లు
చాలామంది దసరా రోజు సాయంత్రం పాలపిట్టను చూస్తారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేదా సహజంగా ఉన్న జమ్మి వృక్షం వద్దకు వెళ్లి పూజలు చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. దీంట్లో భాగంగా నిర్వహించి రావణ దహనానికి భారీ కటౌట్లు సిద్ధం చేసుకున్నారు.
ఫ దసరా ఉత్సవాలకు సిద్ధమైన ప్రజలు
ఫ సందడిగా మారిన పట్టణాలు, పల్లెలు
ఫ రద్దీగా బస్టాండ్లు, రహదారులు
ఫ శమీ పూజ, రావణ దహనానికి ఏర్పాట్లు

నేడే విజయదశమి