
డిగ్రీలో ప్రవేశాలకు 23లోగా దరఖాస్తు చేసుకోవాలి
నల్లగొండ: నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశానికి ఇంటర్ పూర్తి చేసినవారు ఈ నెల 23లోగా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో శనివారం ఆమె డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సులకు దరఖాస్తు చేసుకునే వారు పదవ తరగతి, ఇంటర్ మార్కుల మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, 5 పాస్ ఫొటోలతో పాటుగా జనవరి 2025 తర్వాత పొందిన తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుకు జతచేసి నేరుగా కళాశాలలో అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణికర్ష, కళాశాల అడ్మిషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
‘రైతు నేస్తం’ వీక్షించేలా ఏర్పాట్లు చేయాలి
నల్లగొండ: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులంతా వీక్షించేలా రైతు వేదికల్లో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమం ఏర్పాట్ల విషయమై శనివారం ఆమె వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నల్లగొండ కలెక్టరేట్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని 140 రైతు వేదికల్లో 32 వీడియో కాన్ఫరెన్స్కు అనుగుణంగా ఉన్నాయన్నారు. ప్రతి రైతు వేదికను మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలు, పూలతో అలంకరించాలన్నారు. రైతువేదికల్లో జరిగే రైతు నేస్తానికి సంబంధిత అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి