
వెల్నెస్ సెంటర్లో మందుల్లేవ్!
గంటల తరబడి నిరీక్షణ..
ప్రస్తుతం వెల్నెస్ సెంటర్లోని ఫార్మసీలో ఒక్క ఫార్మసిస్టు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వైద్యులకు చూపించుకున్న వారు మందులు తీసుకోవాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కొన్ని కుర్చీలు మాత్రమే ఉండడం, ఫ్యాన్లు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అదనంగా ఫార్మసిస్టులను నియమించి ఇబ్బందులు తొలగించాలని వెల్నెస్ సెంటర్కు వచ్చే రోగులు కోరుతున్నారు.
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని వెల్నెస్ సెంటర్లో మందుల కొరత ఏర్పడింది. గత పదిహేను రోజులుగా కేవలం రెండు, మూడు రకాల మందులు మాత్రమే ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు మందులు ఇచ్చేందుకు గత ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రతి రోజు సుమారు 200 నుంచి 500 మంది వరకు హెల్త్కార్టు కలిగిన వారు వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె, కిడ్నీ, కీళ్లు, మోకాళ్ల నొప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వెల్నెస్ సెంటర్లో నెలనెలా ఉచితంగా ట్యాబ్లెట్లు తీసుకువెళ్తుంటారు. గత పదిహేను రోజులుగా ట్యాబ్లెట్లు, ఇతర సిరప్లు లేని కారణంగా కేవలం ఒకటి, రెండు ట్యాబ్లెట్లు ఇచ్చి పంపుతున్నారు. ట్యాబ్లెట్లు వచ్చిన తరువాత అందిస్తామని, ఫోన్ చేసి రావాలని సిబ్బంది సూచిస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే అనేక ఇబ్బందులు పడుతున్నారు. మందుల గురించి అడిగితే ఆరోగ్య శ్రీ ట్రస్టుకు ఇండెంట్ పెట్టామని వెల్నెస్ సెంటర్ బాధ్యులు పేర్కొంటున్నారు.
ఫ అందుబాటులో ఉన్నవి రెండు, మూడు రకాల మందులు మాత్రమే
ఫ నెల ప్రారంభం నుంచి కొరత
ఫ ఇబ్బందులు పడుతున్న దీర్ఘకాలిక రోగులు
ఫ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు ఇండెంట్ పెట్టిన అధికారులు
ఇండెంట్ పంపించాం
మందుల సరఫరాలో కొంత జాప్యం జరిగింది. వెల్నెస్ సెంటర్లో అవసరమైన మందుల కోసం ఇండెంట్ పంపించాం. రెండు, మూడు రోజుల్లో సరఫరా చేస్తారు. సరఫరా కాగానే మిగతా మందులను రోగులకు అందిస్తాం.
– డాక్టర్ లావణ్య, వెల్నెస్ సెంటర్ ఇన్చార్జ్