
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 68 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగం లేకుండా, రైతుపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఇందిర సౌర గిరి జల వికాస పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గిరిజన ప్రాంతాలైన దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లోని 14 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. 6800 మంది గిరిజనులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించామన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద గిరిజనులకు పంపిణీ చేసిన భూముల్లో ఈ పథకం కింద సాగు చేసుకునే అవకాశం ఉందని ఆమె వివరించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన, రెండున్నర ఎకరాల పొలం ఉన్న గిరిజన రైతులకు సోలార్ యూనిట్ ఇస్తారమని తెలిపారు. మొదటి సంవత్సరం జిల్లాలో 270 మంది గిరిజనులకు ఈ పథకం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అనంతరం ఈసీఐఎల్ ద్వారా దివ్యాంగులకు పంపిణీ చేయనున్న మోటార్ బ్యాటరీ సైకిళ్లు, తదితర అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి వై.అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి