
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను సోమవారం రాత్రి విత్తన స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. షాపుల్లో నిర్వహించే స్టాక్ రికార్డులు, బిల్ బుక్లు, ఇన్ అవుట్ రిజిస్టర్లను పరిశీలించింది. ఈ సందర్భంగా మునుగోడు ఏడీఏ వేణుగోపాల్, నకిరేకల్ ఇన్చార్జి ఏడీఏ జానిమియా మాట్లాడుతూ విత్తన అమ్మకాల్లో డీలర్లు ఉద్దేశపూర్వకంగా అవకతవకలకు పాల్పడితే విత్తన నియంత్రణ చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట డీలర్ల సంతోష్, నాతి సైదులు, పన్నాల శేఖర్రెడ్డి, తీపిరెడ్డి ఇంద్రారెడ్డి, సామ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.
వైభవంగా నమ్మాళ్వార్ తిరునక్షత్ర వేడుక
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నమ్మాళ్వార్ తిరునక్షత్ర వేడుకను ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వైభవంగా నిర్వహించారు. ఉదయం స్నపనం చేపట్టిన అర్చకులు, రాత్రి ఆళ్వారు సేవలను తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. భక్తులు ఈ సేవలో పాల్గొని, ఆధ్యాత్మిక చింతన పొందారు. నమ్మాళ్వార్ల తిరునక్షత్ర విశిష్టతను ఆలయ ముఖ మండపంలో అర్చకులు భక్తులకు వివరించారు. సేవకు ముందు పారాయణీకులు నమ్మాళ్వార్లకు పారాయణం పఠించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అర్చక బృందం, భక్తులు పాల్గొన్నారు.