
చికిత్స అందించేందుకు ముందుకు రావాలి
నల్లగొండ : దివ్యాంగులు, రక్తహీనతతో బాధపడే రోగులకు చికిత్స అందించేందుకు ముందుకు రావాలని ఈసీఐఎల్కి చెందిన చీఫ్ మెడికల్ అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం నల్లగొండలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారు 52 వేల మంది దివ్యాంగులు ఉన్నారని.. గతంలో ఫ్లోరోసిస్కు గురైన వారు, మానసిక వికలాంగులు, నరాల బలహీనత ఉన్న వారు, కదలలేని పరిస్థితిలో మంచానికే పరిమితమైన వారు ఉన్నారని తెలిపారు. దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం అటవీ ప్రాంతం నుంయి దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండకు రావాల్సి వస్తోందన్నారు. ఎంతోమంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని, రక్తహీనతను తగ్గించేందుకు వారిని చైతన్యవంతులను చేసే విషయంలో సామగ్రిని అందిస్తే బాగుంటుందని సూచించారు. అనంతరం ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వేణుబాబు మాట్లాడుతూ దివ్యాంగుల అవసరాలపై ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలన్నారు. బేస్ లైన్ సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ను సమర్పిస్తామని కలెక్టర్కు తెలిపారు. నల్లగొండ జిల్లాకు 100 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీడీపీఓ హరిత, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం ప్రోగ్రాం అధికారి నాగిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి