నేడు గురుకుల ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

Feb 23 2025 1:47 AM | Updated on Feb 23 2025 1:43 AM

నల్లగొండ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకులాల్లో 5వ తరగతిలో, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష కోసం నల్లగొండలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు 12,929 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మైనార్టీ గురుకులానికి సంబందించి ఇంటర్మీడియట్‌ సీఓ గ్రూప్‌లో చేరేందుకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,070 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. సీఓ గ్రూప్‌లో చేరే విద్యార్థులకు ఐఐటీతో పాటు నీట్‌ కోచింగ్‌ ఇవ్వనున్నారు.

జీ–20 సదస్సుకు ఎంజీయూ విద్యార్థి

నల్లగొండ టూటౌన్‌ : ఢిల్లీలో జరుగనున్న జీ–20 సదస్సుకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ తెలుగు శాఖ విద్యార్థి గణేష్‌ ఎంపికయ్యాడు. పర్యావరణ పరిరక్షణపై ఇచ్చే ప్రాజెక్టును అధ్యయనం చేసి ఢిల్లీలో జరిగే సదస్సులో సమర్పించనున్నాడు. జీ 20 సదస్సుకు ఎంపికై న గణేష్‌ను కళాశాల ప్రిన్పిపాల్‌ కె.అరుణప్రియ, అధ్యాపకులు డాక్టర్‌ సత్యనారాయణ, డాక్టర్‌ ఆనంద్‌, అనితకుమారి అభినందించారు.

బాలికల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

చింతపల్లి : కిశోర బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి అన్నారు. శనివారం చింతపల్లి కేజీబీవీలో బాలికలకు నెలసరిపై అవగాహన కల్పించారు. గుడ్‌ యూనివర్స్‌ ఎన్జీఓ ఆధ్వర్యంలో విద్యార్థినులకు రేసబుల్‌ శానిటరీ నాప్కిన్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల నెలసరి సమయం, వ్యక్తిగత పరిశుభ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రమకాంత్‌ శర్మ, సీడీపీఓ సక్కుబాయి, ఎంపీడీఓ సుజాత, మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీదేవి, ఎంఈఓ నీరుడు అంజయ్య, ప్రిన్సిపాల్‌ వాసవి, లక్ష్మి, అమ్తుల్‌ జమాల్‌ అస్రా తదితరులు పాల్గొన్నారు.

స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ

నల్లగొండ : నల్లగొండలోని సెట్విన్‌ సాంకేతిక శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వయం ఉపాధి కోర్సుల్లో 50 శాతం ఫీజు రాయితీతో శిక్షణ ఇవ్వనున్నట్లు సెట్విన్‌ కో–ఆర్డినేటర్‌ ఎం.సరిత తెలిపారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న ఎడ్యుకేషన్‌ కోర్సులు, కంప్యూటర్‌ బేసిక్స్‌, పీజీడీసీఏ, డీటీపీ కోర్సుల్లో శిక్షణ నిస్తామని పేర్కొన్నారు. విద్యార్థినులు, యువతులకు కంప్యూటర్‌, బ్యూటీషియన్‌, డిప్లొమా ఇన్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌, టెక్‌టైల్స్‌ డిజైనింగ్‌, కుట్టు మిషన్‌ తదితర 26 రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు ఈ నెల 24 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కోర్సులు పూర్తి చేశాక జాబ్‌మేళా నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 9705041789 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

సాహిత్యంతో

సమాజంలో చైతన్యం

రామన్నపేట : సమాజాన్ని చైతన్య పరచడానికి సాహిత్యం దోహదపడుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య అన్నారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగుశాఖ అధ్యక్షుడు తండు కృష్ణకౌండిన్య రాసిన సాహిత్య వ్యాససంపుటి నెరుసు పుస్తకాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. సాహితీరంగంలో దిగ్గజాలైన కవులు, రచయితల రచనలపై విమర్శనాత్మకమైన వ్యాసాలు రాసి కృష్ణకౌండిన్య సాహితీరంగంలో తనదైన ముద్రవేశారని కొనియాడారు. నెరుసు అంటే కత్తిని పదును పెట్టడానికి ఉపయోగించే గుళికరాళ్లపొడి అని, వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన వ్యాససంపుటిని నెరుసు పేరుతో పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత డాక్టర్‌ తండు క్రిష్ణకౌండిన్య , కూరెళ్ల గ్రంథాలయం గ్రంథపాలకుడు తాటిపాముల స్వామి, జువ్వగోని మధు, విద్యార్థులు పాల్గొన్నారు.

నేడు గురుకుల ప్రవేశ పరీక్ష  1
1/1

నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement