ఉప్పునుంతలలోని కొత్త రాంనగర్కు చెందిన రైతు గుర్రపు పాండు(40) బుధవారం రాత్రి పత్తి పంటకు నీళ్లు పారబెట్టి వచ్చి ఇంట్లో పడుకున్నాడు. గురువారం ఉదయం ఎంతకూ నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు చూడగా అప్పటికే మృతిచెందాడు. అయితే ఇతను గుండెపోటుతో చనిపోయాడా.. లేక పాముకాటుతోనా అన్న అనుమానం కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. చివరికి రైతు బీమా కోసం కుటుంబ సభ్యులు వ్యవసాయ విస్తరణాధికారికి సమాచారం ఇవ్వగా బీమా లేదని గడువు ముగిసిందని చెప్పడంతో ఇటు కుటుంబ సభ్యులు, అటు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రైతుకు ఇల్లు కూడా లేదని, కేవలం మూడు ఎకరాల పొలం మాత్రమే ఉందని, కనీసం రైతు బీమా ఉంటే రూ.5 లక్షల పరిహారం అందేదని ఆవేదన చెందుతున్నారు. రైతుకు అండగా ఉన్న బీమా తొలగించడం అన్యాయమని వాపోతున్నారు.


