ఎర్రవల్లి: క్రీడలతో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని కమాండెంట్ జయరాజు అన్నారు. స్థానిక పదో బెటాలియన్లో సోమవారం వార్షిక స్పోర్ట్స్ మీట్–2027లో భాగంగా పలు క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో కలిగే శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పోలీస్ జీవితానికి అత్యంత అవసరమన్నారు. అదే విధంగా సిబ్బందికి క్రమశిక్షణ, సమన్వయం ఉంటుందన్నారు. మూడు రోజులపాటు జరిగే క్రీడా పోటీల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతుందన్నారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా 100, 400 మీటర్ల పరుగుపందెం, 4.400 రిలే, లాంగ్ జంప్, హైజంప్, షాట్పుట్, జావెలిన్ త్రో, 5కే రన్, క్రికెట్ వంటి క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పార్థసారధిరెడ్డి, పాణి వెంకటరమణ, ఆర్ఐలు రాజు, ఆర్పీ సింగ్, నరసింహరాజు, శ్రీనివాసులు, లక్ష్మణ్ పాల్గొన్నారు.


