● రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
● బ్రహ్మగిరిలో పల్లె దవాఖానా ప్రారంభం
అచ్చంపేట/వంగూరు: ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సోమవారం అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరిలో ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆయన పల్లె దవాఖానా ప్రారంభించారు. అనంతరం మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లమల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండటం కోసమే ప్రభుత్వం పల్లె దవాఖానాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా మహిళల ఆర్థికాబివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రూ. 10లక్షలతో చేపట్టిన మహిళా సమాఖ్య భవన నిర్మాణం పూర్తయితే సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉంటుందని అన్నారు. అంతకు ముందు వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని సీఎం రేవంత్రెడ్డి ఇంటికి వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.కృష్ణ, సర్పంచ్ మల్లేష్, ఉపసర్పంచ్ మొయిజ్, అభిలాష్, డా.తారాసింగ్, అంతటి మల్లేష్, చింతల రాజ్గోపాల్, లోక్యానాయక్ పాల్గొన్నారు.


