కొల్లాపూర్ మండలంలోని కృష్ణాతీరంలో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, మిషన్ భగీరథ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది కార్మికులు ఉన్నారు. అదే విధంగా కల్వకుర్తి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఉన్న కాటన్, రైస్ మిల్లుల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులతో పెద్ద ఎత్తున గంజాయి సులువుగా ఇక్కడికి చేరుతోంది. కొల్లాపూర్లో గంజాయి వినియోగించే యువకులు చైన్ నెట్వర్క్గా ఏర్పడి మరీ దందా సాగించడం గమనార్హం. కొల్లాపూర్ పట్టణానికే చెందిన యువకులు సుమారు 30 మంది వరకు గంజాయి వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు.


