రైతు సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమానికి పెద్దపీట

May 24 2026 12:57 AM | Updated on May 24 2026 12:57 AM

నాగర్‌కర్నూల్‌

ఎంపీ మల్లు రవి

అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డా.మల్లు రవి అన్నారు. శనివారం అచ్చంపేటలోని బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రజా భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రూ. 21వేల కోట్లతో రైతులందరి పంట రుణాలను మాఫీ చేయడంతో పాటు రైతుభరోసాతో పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. భూసార పరీక్షలకు అనుగుణంగా రైతులు లాభసాటి పంటలు పండించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయశాఖ అంచనాలకు మించి పంట దిగుబడులు రావడం.. సరైన నివేదికలు లేని కారణంగా కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందన్నారు. ప్రస్తుతం వేగంగా కొనుగోళ్ల ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ప్రతిపక్షాలు అవగాహన లేకుండా ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రానున్న కాలంలో ప్రతి మండలం నుంచి ఇద్దరు ఆదర్శ రైతులను ఎంపికచేసి.. జిల్లాస్థాయిలో అవార్డులు అందజేస్తామని, వారితో పంటల సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. పంటల సాగుకు అవసరమైన నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో యాసంగిలో వరి, మొక్కజొన్న దిగుబడులు పెరిగాయన్నారు. ధాన్యం సేకరణలో ఎదురైన సమస్యలను అధిగమించి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 48లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో రూ. 9,850 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. మాజీ ఎంపీపీ రామనాథం, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎ.గోపాల్‌రెడ్డి, అంతటి మల్లేష్‌, బుచ్చిరాములు, రాంబాబు నాయక్‌, చింతల రాజ్‌గోపాల్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement