మన్ననూర్: ఆదివాసీ చెంచుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అమ్రాబాద్ మండలం మల్లాపూర్ చెంచుపెంటలో చెంచులకు తేనెటీగల పెంపకానికి అవసరమైన బాక్స్లను అందజేశారు. అనంతరం మన్ననూర్ లింగమయ్య కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఆదివాసీ చెంచులకు మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో సొంతిల్లు లేని ప్రతి చెంచు గిరిజన కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో 1,060 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నిరుపేదలైన చెంచులు ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేని కారణంగా ప్రభుత్వమే ఓ సంస్థకు ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత అప్పగించిందని తెలిపారు. మూడు నెలల వ్యవధిలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు మంజుల రాజారాం, కోటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎంఏ రహీం, సింగిల్విండో చైర్మన్ పోశం గణేశ్, ఉపసర్పంచ్ రమణగౌడ్, నాయకులు వెంకటయ్య, హరినారాయణ, బాలింగంగౌడ్, వెంకటరమణ, శ్రీనివాసులు, రవి, వెంకటేశ్వర్లు, సంతోష్, సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, బయ్యన్న, బాలు పాల్గొన్నారు.


