అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సోమవారం అచ్చంపేటలో నూతనంగా నిర్మించిన ఏయూపీఎస్ పాఠశాల భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. అచ్చంపేటకు చెందిన సాదే రాజు పాఠశాలను దత్తత తీసుకుని రూ.17 లక్షల సొంత డబ్బులతో భవన నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేయడం గర్వంగా ఉందన్నారు. సినిమాలో రీల్ ఎవరైనా చేయవచ్చని, రియల్ శ్రీమంతులు ఇలాంటి వారని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టి పట్టణ, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని, దాతలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తోందని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ పాఠశాల నిర్మిస్తున్నారని, రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఈ పాఠశాల అందుబాటులోకి వస్తే 2,500 మందికి విద్య, భోజన వసతి అందుతుందన్నారు. ఇప్పటికే వంగూరు, పోల్కంపల్లిలో రూ.60 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పేద పిల్లలకు ఉన్నత చదువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యాపరంగా ముందు వరుసలో ఉండాలన్నారు. అమ్రాబాద్ మండలం మొల్కమామిడిలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి దాతల సహకారంతో రూ.29 లక్షలు వసూలు చేసి పాఠశాల, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని, ఆయా పాఠశాలల పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ వెంకటేష్, ఎంఈఓ జీవన్కుమార్, సీజేఏసీ గౌరవాధ్యక్షుడు సాదే రాజు, హెచ్ఎం బిచ్చానాయక్ తదితరులు పాల్గొన్నారు.


