హాల్టికెట్.. చెకిట్!
● పేరెంట్స్ వాట్సప్ నంబర్లకు ప్రివ్యూ
● ఈ ఏడాది నుంచే
ప్రవేశపెట్టిన ఇంటర్ బోర్డు
● తప్పులు దొర్లితే ముందస్తుగా సరిచేసుకునే అవకాశం
అచ్చంపేట: పరీక్ష సమయాల్లో ఆందోళనలకు గురికాకుండా ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు ముందుస్తు చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలతోపాటు ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి హాల్టికెట్ల ప్రివ్యూను ఇంటర్ బోర్డు విద్యార్థులకు తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు పంపించనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్ మొబైల్లో వాట్సప్ ఉన్న నంబర్లకు వారి పిల్లలకు సంబంధించిన హాల్టికెట్ల ప్రివ్యూను పంపించనున్నారు. ఈ ప్రివ్యూను ఇటీవలే అమలులోకి తీసుకురాగా.. తల్లిదండ్రులకు పంపిన హాల్ టికెట్స్ ప్రివ్యూలో విద్యార్థికి సంబంధించిన వివరాలను చెక్ చేసుకోవచ్చు. వివరాల్లో ఏమైనా తప్పులు దొర్లితే వెంటనే సంబంధిత ప్రిన్సిపాల్ను సంప్రదించి సరిచేసుకునే సదుపాయాన్ని కల్పించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల హాల్టికెట్స్ ప్రివ్యూ రావాలంటే ఆ విద్యార్థి ఎస్సెస్సీ రూల్ నంబరు, పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా హాల్టికెట్ ప్రివ్యూను చూసుకోవచ్చు.అలాగే రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించి మొదటి సంవత్సరం హాల్టికెట్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెండో సంవత్సరం విద్యార్థి మొదటి సంవత్సరంలో పాసైన, ఫెయిలైన సబ్జెక్టులతోపాటు ఆయా పరీక్షల టైం టేబుల్ వివరాలు ఉండనున్నాయి. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ఫోన్లు ఉండటంతో హాల్టికెట్లను సకాలంలో పొందడం, లోపాలను సరిచేసుకోవడం, విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలలు, జిల్లా అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపర్చడం కోసం ఈ వాట్సప్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థను ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది.
వచ్చేనెల 2 నుంచి ప్రాక్టికల్స్
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 16, ప్రభుత్వ సెక్టారులో 54, ప్రైవేట్ కళాశాలలు 19 ఉండగా.. వీటిలో మొత్తం 13,547 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో మొదటి సంవత్సరం 6,879 మంది, రెండో సంవత్సరం 6,668 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఫ్రిబవరిలో జరగనున్న పరీక్షలకు సంసిద్ధులవుతున్నారు. కాగా ఈ నెల 21న ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్స్, 22న రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ ఉండనుంది. ఫ్రిబవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
హాల్టికెట్.. చెకిట్!


