
ప్రభుత్వ పాఠశాలలన్నీ ఒకే గొడుగు కిందకు
వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి.. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా వంగూరు మండల కేంద్రంలో నెలకొల్పిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశానికి కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ బడుల బలోపేతంలో భాగంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి కార్పొరేట్ స్థాయిలో విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా వంగూరులోని బాలుర, బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకే చోట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 1,500 నుంచి 1,800 మంది విద్యార్థులకు విద్యా బోధన కొనసాగుతుందన్నారు. అయితే విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ. 12కోట్లు మంజూరు చేసిందన్నారు. అనంతరం 36 మందితో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా, గతంలో ఉన్న స్కూల్ డెవలప్మెంట్ కమిటీని యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. వారానికి ఒకసారి కమిటీలు సమావేశమై పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. సమావేశంలో విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేశ్, విశ్వేశ్వర్రావు, జ్యోత్స్నారెడ్డి, డీఈఓ రమేశ్కుమార్, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, ఎంఈఓ మురళీ మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు.
వంగూరులో తెలంగాణ
పబ్లిక్ స్కూల్ ఏర్పాటు
ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం
సౌకర్యాల కల్పనకు
రూ. 12కోట్లు మంజూరు
రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్
ఆకునూరి మురళి