
పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
నాగర్కర్నూల్ క్రైం: పోలీస్ సిబ్బంది విధి నిర్వహణతోపాటు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రతి మూడు నెలలకోసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓల్డ్ హెడ్క్వార్టర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి పోలీసుల కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేసే పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై శాఖాపరంగా ప్రత్యేక దృష్టి సారిస్తామని, త్వరలోనే అచ్చంపేట, కల్వకుర్తి సబ్ డివిజన్ వారీగా ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ క్రమంలో మెడికల్ హెల్త్ క్యాంపులో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు దాదాపు 300 మంది పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులకు వివిధ రకాల పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామేశ్వర్, ఏఆర్ ఏఎస్పీ భరత్, డీఎస్పీ శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాసు తదితరులు పాల్గొన్నారు.