సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

Jun 14 2025 10:04 AM | Updated on Jun 14 2025 10:04 AM

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

కందనూలు: సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో క్షేత్రసాయి సిబ్బందికి సీజనల్‌ వ్యాధుల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది ఎక్కువగా డెంగ్యూ, మలేరియా, నీళ్ల విరేచనాలు, జ్వరాలు నమోదైన గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అంటువ్యాధుల నివారణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులకు ఇనుప జాలీలు బిగించుకోవాలని, దోమతెరలు వాడాలని, ఇంటి ఆవరణలో, పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలని, పాత టైర్లు, పనికిరాని ప్లాస్టిక్‌, గాజు సీసాలు, డిస్పోజబుల్‌ కప్పులు, కొబ్బరి చిప్పలు వంటివి లేకుండా చేసుకోవాలని ప్రజలకు సూచించాలన్నారు. అన్ని పీహెచ్‌సీల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, అనుమానం ఉన్నవారి రక్త నమూనాలు టీ–డయాగ్నోస్టిక్‌ హబ్‌కు ప్రతిరోజు పంపాలని చెప్పారు. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపించే టైఫాయిడ్‌, డయేరియా తదితర వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని, ముఖ్యంగా పరిశుభ్రమైన నీరు, చేతుల శుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి ఏఎన్‌ఎంలు, ఆశాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 31 వరకు నిర్వహించే ‘నీళ్ల విరేచనాలను ఆపండి’ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశాలు ఐదేళ్లలోపు చిన్నారుల ఇంటికి వెళ్లి ముందస్తు జాగ్రత్తగా ఓఆర్‌ఎస్‌ పాకెట్లు అందించాలని, డయేరియా కలిగిన పిల్లలకు జింక్‌ మాత్రలు, ఓఆర్‌ఎస్‌ పాకెట్లు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటదాస్‌, ప్రోగ్రాం అధికారి రాజశేఖర్‌, డాక్టర్‌ ప్రదీప్‌, ఎపిడెమియాలజిస్ట్‌ ప్రవళిక, ఏఎంఓ శ్రీనివాసులు, డీపీఓ రేనయ్య, ఏపీఓలు విజయ్‌కుమార్‌, రాజేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement